Thursday, November 1, 2018

Closing of #SADHANACAMP_2018

--దృఢ సంకల్పానికి గట్టి సాధన తోడైతే అద్భుతాలు సృష్టించవచ్చు--పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ చింతకింది మల్లేశం
--సాధన కుటీర్ లో సాధనా శిభిరం ముగింపు కార్యక్రమం

రంగా రెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలోని వినోబా నగర్ సాధన కుటీర్ ప్రభుత్వ బడుల్లో చదివే పల్లె అణిముత్యాల ప్రతిభకు సనేపట్టే మహోత్తర కార్యక్రమాన్ని గతకొన్ని సంవత్సరాలుగా జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ చేపడుతోంది.

పూర్వపు రంగారెడ్డి మరియు నల్లగొండ జిల్లాల్లోని కొన్ని ప్రభుత్వ బడుల విద్యార్థులకు పాటలు, యోగ, చిత్రలేఖనం, వ్యాసరచన మరియు ఉపన్యాసం అంశాలలో ఎంపిక చెసిన 60 మంది విద్యార్థులకు వారం పాటు ఈ సాధన శిబిరం కొనసాగింది.
జ్ఞానసరస్వతి ఫౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సాధన శిబిరం ముగింపు కార్యక్రమం ఈ రోజు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ చింతకింది మల్లేశం గారు , ప్రత్యేక అతిథిగా హాజరైన ప్రముఖ జానపద గాయకులు మరియు రచయిత డా.శ్రీ బోనాల ప్రకాష్ గారు హాజరయ్యారు.

ఈ సందర్భంగా మల్లేశం గారు మాట్లాడుతూ దృఢ సంకల్పానికి గట్టి సాధన తోడైతే అద్భుతాలు సృష్టించవచ్చునని, దీనికి ప్రత్యక్షసాక్ష్యం తాను చేనేత రంగం లో ఆవిష్కరించిన ఆసుయంత్రమే అని విద్యార్థులకు వివరించారు.ఈ ఆసుయంత్ర సృష్టి తనకు అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిపెట్టిందని,ఫోర్బ్స్ జాబితాలో ప్రథమ స్థానంలో ఉండేలా చేసిందని, కానీ తాను చదివింది మాత్రం నల్లగొండ జిల్లా లోని ప్రభుత్వ బడిలో కేవలం 6వతరగతి వరకు మాత్రమే అని గుర్తు చేశారు.జ్ఞానసరస్వతి ఫౌండేషన్ వారు విద్యార్థుల్లో దాగిన నైపుణ్యాలను గుర్తించి, వారికి సుశిక్షితులచే శిక్షణ శిబిరాలు నిర్వహించడం అభినందనీయం అనీ,ఈ విధమైన శిబిరాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

అదేవిధంగా ఈ కార్యక్రమానికి ప్రత్యేక అతిథిగా హాజరైన ప్రముఖ జానపద గాయకులు & రచయిత డా.శ్రీ బోనాల ప్రకాష్ గారు మాట్లాడుతూ విద్యార్థులు ఆటపాటలతో ఆడుతూ పాడుతూ ఆనందంగా వివిధ విషయాలపై అవగాహన పెంచుకుని ఎదగాలని తెలిపారు,ఈ క్రమంలో ఎన్ని అవరోధాలు ఎదురైనా లక్ష్యాన్ని మరువకూడదని తెలియజేశారు. ఈ విధమైన సదృఢ సంకల్పమే మనల్ని ఉన్నత శిఖరాలకు చేరుస్తుంది అని విద్యార్థులకు ప్రేరణ కలిగించారు.
ఈ సందర్భంగా జ్ఞాన సరస్వతి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు సదా వెంకట్ రెడ్డి గారు మాట్లాడుతూ ప్రతిభ కల్గిన ఏ  విద్యార్థి కూడా కేవలం ఆర్థిక బీదరికం కారణంగా తన ప్రతిభను కోల్పోరాదనీ, అలాంటి వారికి చేయూతను అందించడమే ఫౌండేషన్ లక్ష్యం అని తెలిపారు.

జ్ఞానసరస్వతి ఫౌండేషన్ కార్యదర్శి శ్రీ ముద్దం వెంకటేశం గారు మాట్లాడుతూ ఇప్పుడు ఉన్న సమాజంలో ఉన్న స్థానం నుండి ఉన్నత స్థానానికి ఎదిగి నేటి సమాజానికి మార్గదర్శనం చేసేలా ఎదిగిన వ్యక్తులచే విద్యార్థులకు ప్రత్యక్ష ఇంటరాక్షన్ లు నిర్వహించడం ద్వారా విద్యార్థుల్లో ప్రత్యేక వైఖరులను ఏర్పరచడం జరిగిందని తెలిపారు. ఈ శిబిరం లో 75 మంది విద్యార్థులు, 15 మంది శిక్షకులు,20 మంది వాలంటీర్లు పూర్తిసమయాన్ని వెచ్చించడం జరిగిందని తెలిపారు.

ఈకార్యక్రమానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకారాన్ని అందించిన వ్యక్తులకు& సంస్థలకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ప్రముఖ సాహితీ విమర్శకులు,కవి& పాత్రికేయులు శ్రీ తిరునగరి శ్రీనివాస్ గారు, ఇబ్రహీంపట్నం మండలం విద్యాధికారి శ్రీ వెంకట్ రెడ్డి గారు,హయాత్ నగర్ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయులు శ్రీ శ్రీనివాస్ గౌడ్ గారు,నక్కా శ్రీనివాస్ యాదవ్ గారు, GSF వాలంటీర్లు, విద్యార్థుల తల్లిదండ్రులు, మరియు GSF తో అనుబంధం ఉన్న పూర్వవిద్యార్థులు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేసినట్లు తెలిపారు.

No comments:

Post a Comment