తెలుగు భాషను భవిష్యత్ తరాలకు భద్రంగా అందిద్దాం.
___సదా వెంకట్, జ్ఞానసరస్వతి ఫౌండేషన్.
అందరం భాగస్తులమవుదాం- మన వంతు సహకారం అందిద్దాం.
తెలుగు భాషను భవిష్యత్ తరాలకు భద్రంగా అందించాలనే సదాశయంతో, పాఠశాల స్థాయి విద్యార్థుల్లో తెలుగు భాషపై మక్కువ, పట్టు, అభిరుచి పెంపొందించాలనే ఉద్దేశంతో "పద్యాలతో రణం" అనే కార్యక్రమాన్ని నిర్వహించాలనే సంకల్పం కలిగింది.
ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థుల సమగ్ర వికాసం కోసం జ్ఞానసరస్వతి ఫౌండేషన్ (GSF) 2008 సంవత్సరం నుంచి రంగారెడ్డి జిల్లాలో వివిధ కార్యక్రమాలను నిర్వహిస్తోంది. వాటిలో దేశభక్తి గేయాల పోటీలు, ప్రతిభా పురస్కారాలు, ప్రభుత్వ పాఠశాలల వార్షికోత్సవాలు, పదవ తరగతి విద్యార్థుల కోసం "లక్ష్యం" పేరుతో 40 రోజుల శిబిరాలు వంటి ఎన్నో కార్యక్రమాలు చేపట్టి, గత రెండు దశాబ్దాలుగా ప్రభుత్వ అధికారులు, ఉపాధ్యాయులు, సహృదయులైన పెద్దల సహకారంతో విజయవంతం గా నిర్వహించడం జరుగుతున్నది.
ఈ కార్యక్రమాల ద్వారా వచ్చిన అనుభవ సారంతో GSF–SAC (Sports, Academics & Cultural) కార్యక్రమానికి రూపకల్పన చేయడమైంది.
ప్రతిభావంతుడైన ఏ విద్యార్థి కేవలం ఆర్థిక బలహీనత కారణంగా తన ప్రతిభను కోల్పోకూడదనే లక్ష్యంతో, అభిరుచి మరియు ప్రతిభ ఉన్న అంశాల్లో విద్యార్థులను ఎంపిక చేసి, సాధన కుటీర్లో నిరంతర శిక్షణా శిబిరాలను నిర్వహిస్తున్నాము.
వివిధ అంశాల్లో నిర్వహిస్తున్న ఈ శిబిరాల్లో భాగంగానే, ప్రస్తుత పరిస్థితుల్లో తెలుగు భాష ఎదుర్కొంటున్న సవాళ్లను చూసి కలిగిన ఆవేదనతో, తెలుగు భాషను భవిష్యత్ తరాలకు భద్రంగా అందించాలనే ఆశయంతో, పద్యం బతికి ఉంటే తెలుగు భాష జీవచైతన్యం తో వెలుగొందుతుందన్న సంకల్పం తో "పద్యాలతో రణం" కార్యక్రమానికి రూపకల్పన చేయడం జరిగింది.
ఈ ఆలోచనకు సరైన సమయంలో గౌరవనీయులు శ్రీ దోరవేటి గారి మార్గదర్శనం, సహకారం , ఆశీస్సులు లభించడం మా అదృష్టంగా భావిస్తున్నాను. అనంతరం శ్రీ భవాని జగదీశ్వర్ రెడ్డి గారి సమన్వయంతో, పలువురు తెలుగు ఉపాధ్యాయులు, తెలుగు భాషాభిమానులు, తెలుగు ఉపాధ్యాయ సంఘాల నాయకుల సహకారం లభించి ఈ కార్యక్రమం కార్యరూపం దాల్చింది. అలాగే జిల్లా విద్యాశాఖ అనుమతి లభించడం మాకు మరింత ఉత్సాహాన్ని, ప్రోత్సాహాన్ని కలిగించింది.
ఇదే సమయంలో విద్యార్థులకు ఉపయోగపడే విధంగా పద్యాలను సేకరించిన శ్రీ కాందాడై రంగరాజు గారు పుస్తక రూపంలో తీసుకురావడం, ఇది ముద్రించే అవకాశం జ్ఞానసరస్వతి ఫౌండేషన్ కు ఇవ్వడం ఎంతో ఆనందాన్ని కలిగించింది.
పాఠశాల, మండల స్థాయిలలో "పద్యాలతో రణం" కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహిస్తున్న తెలుగు భాష ఉపాధ్యాయులకు, తెలుగు భాషాభిమానులకు జ్ఞానసరస్వతి ఫౌండేషన్ పక్షాన ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
కేవలం ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల భాగస్వామ్యంతో రంగారెడ్డి జిల్లాలో తొలిసారిగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమం ఇతర జిల్లాలకు కూడా స్ఫూర్తిగా నిలవాలని, విద్యాశాఖ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమాన్ని విస్తరించి, తెలుగు భాషను భవిష్యత్ తరాలకు భద్రంగా అందించే మహత్తర లక్ష్యానికి ప్రభుత్వ పాఠశాలలు బలమైన వేదికలుగా మారాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తున్నాను.
ఈ కార్యక్రమ నిర్వహణకు ప్రత్యక్షంగా సహకరించిన గౌరవనీయులు శ్రీ దోరవేటి గారికి, సోదర సమానులు, తెలుగు ఉపాధ్యాయులు శ్రీ భవాని జగదీశ్వర్ గారికి, మిత్రులు శ్రీ కందాడై రంగరాజు గారికి, తెలుగు ఉపాధ్యాయ సంఘాల నాయకులకు, అలాగే ఈ కార్యక్రమానికి అనుమతి ఇచ్చి మమ్మల్ని ప్రోత్సహించిన జిల్లా విద్యాశాఖ అధికారులకు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
###############
ఈ పద్యాల తోరణం కార్యక్రమ నిర్వహణ కోసం తమ వంతు సహకారాన్ని అందించి, ఉత్సవం వైభవంగా జరగడoలో భాగస్తులు కావాలని అందరినీ ఆవనిస్తున్నాం.
###############
భవదీయుడు,
తెలుగు భాషాభిమాని,
సదా వెంకట్,
జ్ఞానసరస్వతి ఫౌండేషన్(GSF)